Latest Cinema news
డబుల్ మాస్ ట్రీట్తో ఫ్యాన్స్కు కిక్ ఇస్తున్న డబుల్ ఇస్మార్ట్..
‘ఉస్తాద్.. ఇస్మార్ట్ శంకర్..’ అంటూ ప్రేక్షకులకు మాస్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో చూపించిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ కూడా ఒకటి. ర్యాపూ రామ్ పోతినేని, సత్యదేవ్, నిధి అగర్వాల్, నభా నటేష్.. హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించగా; మణిశర్మ సంగీతం అందించారు. మార్ ముంతా.. చోడ్ చింతా.. అంటూ రామ్ పలికిన డైలాగ్స్ ఇప్పటికీ ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని ఒక ప్రత్యేక స్థానంలో ఉండేలా చేస్తాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉందంటూ పూరీ ప్రకటించినప్పటి నుంచే దాని పై అభిమానులకు ఓ స్థాయిలో అంచనాలు ఏర్పడిపోయాయి.
తాజాగా ఇస్మార్ట్ శంకర్ సినిమా సీక్వెల్ను ‘డబుల్ ఇస్మార్ట్’ పేరుతో మొదలుపెట్టారు పూరీ జగన్నాథ్. ఈ సినిమా షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించడమే కాదు.. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు టీమ్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త గత రెండు మూడు రోజులుగా చిత్రసీమలో తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే- గత 25 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్కు దూరంగా ఉన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో ఓ పాత్రలో నటిస్తున్నారన్నది దాని సారాంశం.
తాజాగా పూరీ కనెక్ట్స్ పేజీ ద్వారా సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని ధృవీకరించింది డబుల్ ఇస్మార్ట్ టీం. అంతేకాదు.. సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను సైతం విడుదల చేసింది. ఇందులో మాస్ లుక్లో సంజయ్ దత్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన ‘బిగ్ బుల్’ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లో మనకు తెలుస్తుంది.
పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కథను చాలా పటిష్ఠంగా సిద్ధం చేశారట పూరీ. ‘ఇస్మార్ట్ శంకర్’లోనే రామ్ని మాస్కి మిర్రర్లా చూపించారని అనుకుంటే; ఈ సీక్వెల్లో అంతకంటే మాసీయెస్ట్గా రామ్ని చూస్తారని అంటున్నారట పూరీ. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు ఈ మూవీ టీం.