మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రం నుంచి జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే రెండో పాట విడుదల చేసింది మూవీ టీం. డప్పేసుకో.. దరువేసుకో.. వవ్వారే అదిరే పాటేస్కో.. అంటూ ఒక పార్టీ సెలబ్రేషన్ మోడ్లో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతుంది. ‘జామ్ జామ్.. జామ్ జామ్.. జజ్జనక.. తెల్లార్లు ఆడదాం తయ్యితక్కా’ అంటూ మళ్లీ మళ్లీ సంగీత ప్రియులంతా తిరిగి ఆలపించేంత చక్కని సాహిత్యంతో, ఎనర్జటిక్ మ్యూజిక్తో ఈ పాటను వినసొంపుగా రూపొందించారు మేకర్స్.
కేవలం వినడానికే కాదు.. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తిసురేశ్, అక్కినేని సుశాంత్.. లతో స్క్రీన్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక మాస్ బీట్కి వీరేసిన స్టెప్స్ కూడా ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. ఈ పాటలోనే ప్రాచుర్యం పొందిన తెలంగాణ జానపద గీతం అయిన నర్సపెల్లె పాటకు నర్సపెల్లె గండిలోన గంగధారి.. నాటుపిల్లే కలిసినాది గంగధారి అంటూ మరో కొత్త వెర్షన్ కూడా వినిపించారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లి, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. మహతి స్వరసాగర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న భోళాశంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలోని ఒక్కో పాటను వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు మూవీ టీం. అలాగే ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో తలమునకలై ఉంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్గా భోళాశంకర్ను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన మొదటి పాటతో అభిమానులంతా ఇంకా భోళా మానియాలో ఉండగానే జామ్ జామ్ జజ్జనక అంటూ సాగే ఈ పాటతో ఒకేసారి పార్టీ మోడ్లోకి వెళ్లిపోయారంతా. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తుండగా; చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది.